Wednesday, July 3, 2024

విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?

బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ కేంద్ర పర్యావరణశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ సంస్థ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా విచారణ కొనసాగుతున్నది. పర్యావరణ చట్టాలను తాము ఉల్లంఘించలేదని, తమ మైనింగ్ అనుమతులను రద్దు చేస్తే ఆ ప్రాంత ఆదివాసుల అభివృద్ధి కుంటువడుతుందని వేదాంత తన పిటిషన్‌లో పేర్కొన్నది. బాక్సైట్ సరఫరా లేకపోతే లాంజిగఢ్‌లో తాము నెలకొల్పిన అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఉత్పత్తి కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని వివరించింది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వంతో తమకు ఒప్పందం ఉందని, పర్యావరణ శాఖ సైతం మొదట అనుమతినిచ్చి ఇప్పుడు రద్దు చేయడం అక్రమమని వాదించింది. వేదాంత వాదనలతో ఏకీభవిస్తూ ఒరిస్సా ప్రభుత్వ న్యాయవాది కూడా అత్యున్నత న్యాయస్థానంలో తమ అభివూపాయాలను వినిపించారు. కాగా, నియాంగిరిలో వేదాంత కంపెనీ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువు కావ డం వల్లే తాము అనుమతిని ఉపసంహరించుకున్నామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. అన్ని పక్షాల వాదనలను విన్న కోర్టు వేసవి సెలవులకు ముందు తుది తీర్పు వెలువరిస్తామని రూలింగ్ ఇచ్చింది.

ఇక్కడ చర్చ వేదాంత గురించే. స్వల్ప పెట్టుబడులతో అనిల్ అగర్వాల్ అనే ముంబయి పారిక్షిశామికవేత్త 1976లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుత ఆస్తుల విలు వ రూ. లక్షా 44వేల 450 కోట్లంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. వేదాంత చాలా వేగంగా దూసుకుపోవడానికి, ఖనిజ వనరుల రంగంలో మొనగాడుగా వర్ధిల్లడానికి ప్రస్తుత కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆశిస్సులే కారణమనే వారున్నారు. ప్రారం భ కాలంలో సంస్థ డైరెక్టర్లలో ఒకరిగా ఆయన ఉండేవారని, తర్వాతికాలంలో ఆయన ఎదుగుదలతో పాటే వేదాంత పలుకుబడి కూడా బాగా పెరిగిందని వారంటారు. ఆయన సతీమణి ఇప్పటికీ సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తుండడమే ఇందుకు తిరుగులేని సాక్ష్యమంటారు. యునైటెడ్ ఫ్రంట్, యూపీఏ ప్రభుత్వాల్లో ఆయన కీలక సభ్యునిగా ఉంటూ దేశంలోని అనేక ప్రాంతాల్లో కీలక మైనింగ్ కాంట్రాక్టులు ఇప్పించడంతోనే సంస్థ దశ తిరిగిందంటారు. ఆ విషయాల్లో నిజమెంతో చెప్పలేం కాని వేదాంత ఎదుగుదల క్రమం మాత్రం సహజంగా లేదన్నది మాత్రం అక్షర సత్యం. వేదాంత రిస్సోస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఖనిజ వనరుల రంగంలో ప్రవేశించిన ఈ సంస్థ మొదట భారత్‌కే పరిమితమైంది. రాగి, అల్యూమినియం, జింక్, సీసం, ఇనుము, బంగారం తదితర రంగాల్లో కార్యకలాపా లు ప్రారంభించింది. 2003లో లండన్ స్టాక్ ఎక్సేంజీలో స్థానం సంపాదించింది. ఆస్ట్రేలియా, జాంబియా, నమీబి యా, దక్షిణావూఫికా, లైబీరియా, ఐర్లాండ్‌లకు విస్తరించింది. బ్యాంకింగ్ దిగ్గజం జే పీ మోర్గాన్ మద్దతుతో పబ్లిక్ ఇష్యూకు వెళ్లి భారీయెత్తున పెట్టుబడులను సమీకరించింది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి మొదలుకొని పలు సంస్థలు పెట్టుబడులు సమకూర్చాయి. ఈ బలంతో, వరుస ప్రభుత్వాలు అనుసరించిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాల దన్నుతో వేదాం త వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. తన పెట్టుబడులతో స్టెరిలైట్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, సెసా గోవా, బాల్కో(భారత్ అల్యూమినియం కంపెనీ), మాల్కో(మవూదాస్ అల్యూమిని యం కంపెనీ), వేదాంత అల్యూమినియం, స్టెరిలైట్ ఎనర్జీ, అస్ట్రేలియన్ కాపర్ మైన్స్, కొంకోలా కాపర్ మైన్స్ వంటి సంస్థలను శాసిస్తోంది.

మధ్యభారతంలోని ఖనిజవనరులపై కన్నేసిన వేదాంత 1990ల చివరలో ఒరిస్సాలోని నియాంగిరి పర్వతక్షిశేణుల్లో అపారమైన బాక్సైట్ నిల్వలున్నట్లు గుర్తించింది. ఇక్కడ మైనింగ్ హక్కుల కోసం లాబీయింగ్ ప్రారంభించింది. బాక్సైట్ తవ్వకాల కోసం, అల్యూమినియం శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పడం కోసం 2003లో ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తవ్వకాలు చేబడితే అది పర్యావరణంపై, జంతుజాలంపై, స్థానిక గిరిజనులపై ఎలాంటి ప్రభావం కలుగజేస్తాయనే విషయంపై భారీగా నిధులను సమకూర్చి నిపుణులతో అధ్యయనం చేయించింది. తనకు అనుకూలంగా నివేదికలు రాబట్టుకుంది. ఈ అధ్యయన నివేదికల ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ తాత్కాలిక అనుమతిని సంపాదించింది. 2004లో లాంజిగఢ్‌లో 2060 ఎకరాల స్థలంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పింది. అయితే, నియాంగిరి కొండలపై బాక్సైట్ మైనింగ్ స్థానిక ఆదివాసుల జీవన విధ్వంసానికి కారణమవుతుందంటూ పీయూసీఎల్ తదితర ప్రజాసంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కొంతకాలం పాటు ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. పలు దఫాల విచారణ అనంతరం లాభాల్లో ఐదు శాతం వాటాను స్థానిక ఆదివాసుల అభివృద్ధికి ఖర్చు పెట్టే షరతుపై 2008 ఆగస్టులో కోర్టు మైనింగ్‌ను అనుమతించింది.
వేదాంత మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ స్థానికులు కొనసాగిస్తున్న ఉద్యమం గురించి ఇక్కడ పేర్కొనాలి. ప్రాజెక్టు ప్రారంభమైన వెంటనే స్థానిక ఆదివాసులు సంఘటితమై నియాంగిరి సురక్షా సమితిని ఏర్పాటుచేసుకుని పోరాటం మొదలుపెట్టారు. నిరసన సభలు, ధర్నాలు, ఊరేగింపులు, బంద్‌లు నిర్వహించారు. వేదాంత పంపిన ఆదివాసేతర గూండాల దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. మైనింగ్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చిం ది. గ్రీన్ కలహంది, కలహంది సచేతన్ నాగరిక్ మంచ్ వంటి సంస్థలు ఏర్పడి ఉద్యమంలో చేరాయి. నియాంగిరి కొండలపై నివసించే డోంగ్రియా, కుటియా కోందులు ప్రపంచంలోనే అరుదైన తెగలని, బాక్సైట్ మైనింగ్ వల్ల ఈ తెగల అస్తిత్వానికే ప్రమాదమని గుర్తించి పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ నిపుణు లు రంగంలోకి దిగారు. వేదాంత తలపెట్టిన ప్రాజెక్టు అభివృద్ధికి మించి జీవన విధ్వంసాన్ని సృష్టిస్తుందని, పర్వావరణానికి ప్రమాదమని, భూగర్భ జలాలు అడుగంటుతాయని, జంతుజాలం నశిస్తుందని, ఇప్పటికే అల్యూమినియం కర్మాగారం వల్ల కలిగిన కాలుష్యం, పోగుబడిన వ్యర్థ పదార్థాలు ఇందుకు సాక్ష్యమని వీరు గొంతెత్తారు. ఫలితంగా అంతర్జాతీయ సమాజం స్పందించింది. మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, సర్వైవల్ ఇంటర్నేషనల్ వేదాంత కార్యకలాపాలను వ్యతిరేకించాయి. నియాంగిరిలో జరుగుతున్న ఆదివాసుల హక్కుల హననంపై, చట్టాల ఉల్లంఘనపై నివేదికలు విడుదల చేశాయి. దీంతో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సహా బ్రిటన్‌కు చెందిన పలు వ్యాపార సంస్థలు వేదాంత నుంచి తమ షేర్లను ఉపసంహరించుకున్నాయి.

నియాంగిరి ఆదివాసుల పోరాటం, అంతర్జాతీయంగా పెల్లుబికిన నిరసన నేపథ్యంలో కేంద్రం ఎన్ సీ సక్సేనా నేతృత్వంలో నలుగురు నిపుణులతో కమిటీ వేసింది. ఈ కమిటీ 2010 ఆగస్టు 16న తన నివేదికను సమర్పించింది. అటవీ సంరక్షణా చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని, పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని, ఒరిస్సా అటవీ చట్టాన్ని వేదాంత ఉల్లంఘించిందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ సంస్థతో కుమ్మక్కయ్యారని నివేదికలో పేర్కొన్నారు. నియాంగిరిలో మైనింగ్ వల్ల రెండు అతి పురాతన తెగల అస్తిత్వానికి ప్రమాదమేర్పడుతుందని తేల్చారు. ఇలాంటి చర్యలు ప్రజల్లో ప్రత్యేకించి గిరిజనుల్లో ప్రభుత్వాలపై, చట్టాలపై నమ్మకం పోయేలా చేస్తాయని వివరించారు. ఆ వెంటనే ఆగస్టు 24న వేదాంత కంపెనీకి ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. అయితే, సమస్య ఇంతటితో సమసిపోలేదు. ఒరి స్సా ప్రభుత్వ దన్నుతో, కేంద్రంలోని కొందరు పెద్దల ప్రోత్సాహంతో వేదాంత తిరిగి సుప్రీంను ఆశ్రయించింది. తమ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడం అక్రమమని, గతంలో కోర్టు ఆదేశించిన మేరకు నియాంగిరి ప్రాంత ఆదివాసుల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నామని పేర్కొంది. లాంజిగఢ్ ప్రాజెక్టు ఏరియా డెవలప్‌మెంట్ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి రూ.17 కోట్ల పనులను చేపట్టామని తెలిపింది. పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్నది.

మసకబారిన తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఇటీవల వేదాంత భారీ ప్రచార కేంపెయిన్‌ను ఆరంభించింది. ఆదివాసుల అభివృద్ధే తమ వేదాంతమని స్పష్టం చేసింది. దేశంలోని ఆదివాసులకు తాము చేస్తున్న మేలును తెలుపుతూ జాతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో భారీగా ప్రకటనలను విడుదల చేసింది. మధ్య భారతంలోని అనేక నగరాల పొలిమేరల్లో హోర్డింగులు ఏర్పాటు చేసింది. 550 గ్రామాలకు చెందిన 27 లక్షల మంది గిరిజనులు తమ అభివృద్ధి కార్యక్షికమాల మూలంగా లబ్ధి పొందుతున్నారని తెలిపింది. రెండున్నర లక్షల మంది పిల్లలకు పోషకాహారాన్ని, 22 లక్షల మందికి వైద్యసేవలను అందిస్తున్నామని, 10 లక్షల మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్యను ఉచితంగా నేర్పుతున్నామని, కోటి 20 లక్షల చెట్లు నాటామని వివరించింది. వేదాంత యూనివర్సిటీని, ఆస్పవూతులను నెలకొల్పుతున్నామని ప్రకటించింది. ఆదివాసుల అభివృద్ధి గిట్టనివారే తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, ఉద్యమాలు నడుపుతున్నారని విమర్శించింది.
లాభాలే లక్ష్యంగా ఏర్పడిన బహుళజాతి కంపెనీ వేదాంత అభివృద్ధి మంత్రం జపించడం దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల్లోని బాక్సైట్, ఇనుప గనుల్లో పెట్టుబడులు పెడుతున్నది ఆదివాసులను ఉద్ధరించడానికేనని చెప్పడం పచ్చి అబద్ధం. టన్ను ఖనిజానికి వందల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ రూపేణా చెల్లించి వేల కోట్ల రూపాయలకు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడం ఏ రకంగా ప్రజాసేవో దేశ ప్రజానీకం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఓ వేదాంత బహుళజాతి దిగ్గజంగా మారడానికి, మరో జిందాల్ సామ్రాజ్యం విస్తరించడానికి, పోస్కో, మిట్టల్ వంటి కంపెనీలు ఇక్కడ పాగా వేయడానికి ఆదివాసీ ప్రాంతా ల్లో దండిగా ఉన్న వనరుల దోపిడీయే కారణం. మధు కోడాలు, గాలి జనార్దన్‌డ్డిలు తయారుకావడానికి, విచ్ఛలవిడిగా కుంభకోణాలు జరగడానికి, సమాజంలో అవినీతి పెచ్చరిల్లడానికి మూలాలు కూడా ఈ దోపిడీలోనే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. రెడ్ కారిడార్ బూచిని చూపుతూ మధ్య భారతాన్ని కార్పొరేట్ కారిడార్‌గా మార్చడానికి యత్నిస్తున్న పాలకుల కుటిల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.

 

  • డి మార్కండేయ

Latest News