Wednesday, July 3, 2024

పౌరులపై ‘సాయుధ’ చట్టం ?!

ఇరోం షర్మిల చాను.. ఈ పేరు వినని వారు అరుదు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ 2000 నవంబర్ 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ సంచలనం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని మలోం గ్రామ సమీపాన ఓ బస్టాపు వద్ద నిలబడివున్న ప్రయాణికులపై అస్సాం రైఫిల్స్ జవాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన నేపథ్యంలో మరుసటి రోజు షర్మిల తన దీక్షను మొదలుపెట్టింది. ఎవరిని కాల్చుతున్నామో కూడా పట్టించుకోకుండా ప్రజలపై గుళ్ల వర్షాన్ని కురిపించే అధికారాన్ని జవాన్లకు దఖలుపర్చిన సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నది. నాటినుంచి ఆమె పోలీసుల నిర్బంధంలోనే ఉన్నది.

భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యాయత్నం కింద ఆమెపై నేరం మోపారు. ఈ నేరం కింద ఏడాది పాటు జైలుశిక్ష విధించవచ్చు. శిక్ష విధించడం, విడుదలైన రోజునే మళ్లీ లాంఛనంగా అరెస్టు చేయడం, తిరిగి ఏడాది శిక్ష వేయడం.. ఇలా పదకొండేళ్లుగా ఇంఫాల్లోని జవహర్లాల్ నెహ్రూ ఆస్పత్రి షర్మిల పాలిట జైలుగా మారింది. ముక్కులో చొప్పించిన పైపుల ద్వారా బలవంతంగా ఆమె శరీరంలోకి ద్రవపదార్థాలు పంపిస్తున్నారు. పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాశవిక చట్టాన్ని రద్దు చేసేవరకు తన దీక్షను విరమించేది లేదని ఆమె చెప్తోంది.

అపరిమిత అధికారాలు..

షర్మిల దీక్షతో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం(ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ) వార్తల్లోకెక్కింది. 1958 మే 22న ఆర్డినెన్స్ గా అమల్లోకి వచ్చి ఆ తర్వాత పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం సైజులో చాలా చిన్నది. అధికారాల విషయంలో అతి పెద్దది. ఒకే పేజీలో, కేవలం ఆరు సెక్షన్లలో భారత సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ఇది కట్టబెట్టింది. కల్లోలిత ప్రాంతంగా రాష్ట్ర గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓ ప్రాంతంలో పనిచేస్తున్న పారా మిలిటరీ లేదా ఆర్మీకి చెందిన కమీషన్, నాన్ కమీషన్, వారంట్ అధికారులకు కార్యనిర్వాహక అధికారాలే కాకుండా మెజిస్టీరియల్ అధికారాలను కూడా ఈ చట్టం కల్పించింది.

చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని లేదా ఉల్లంఘించే అవకాశముందని తాము భావిస్తే చాలు.. ఎవరిపైనైనా కాల్పులు జరపవచ్చు. చంపవచ్చు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదనే నిబంధనను అతిక్రమించినా బలప్రయోగం చేయవచ్చు. సాయుధులు దాగివున్నారని లేదా మందుగుండు దాచారని భావించిన నివాసాలను ధ్వంసం చేయవచ్చు. నేరం చేశాడని భావించిన ఏ వ్యక్తినైనా వారంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. ఈ చట్ట పరిధిలో చర్యలకు పాల్పడిన వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే విచారణకు అనుమతించాలి.

మిలిటరీ పాలన..

కల్లోలిత ప్రాంతంగా ప్రకటించడానికి ఒక రాష్ట్రంలో లేదా రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో నెలకొని ఉండాల్సిన పరిస్థితులపై ఈ చట్టంలో ఎలాంటి వివరణా లేదు. శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందన్న కారణంతో రాష్ట్ర గవర్నర్ కాని, కేంద్ర ప్రభు త్వం నేరుగా కాని ఒక ప్రాంతాన్ని కల్లోలితంగా ప్రకటించి మిలిటరీని దించవచ్చు. ఆయా రాష్ట్రాల శాసనవ్యవస్థల ప్రసక్తి లేకుండానే గవర్నర్ సైనిక బలగాలకు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టవచ్చు. శత్రుదేశంపై యుద్ధం ప్రకటించాలన్నా అంతర్జాతీయ సమాజానికి కారణాలు చెప్పాల్సివున్న నేటికాలంలో తనదే అయిన రాష్ట్రం లో మిలిటరీని దించడానికి ఓ పెన్నుపోటు సరిపోవడం భారత ప్రజాస్వామ్యానికే చెల్లుతుంది.

53 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో, 1990 నుంచి జమ్మూ-కాశ్మీర్ లో ఈ చట్టం అమలులో ఉన్నది. ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి ఈ చట్టాన్ని కేంద్రం సూచన మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు పొడిగిస్తున్నారు. ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరిపోయాయని, దేశభద్రతకు ప్రమాదముందని, స్థానిక పోలీసు బలగాలు అదుపు చేయలేకపోతున్నాయని ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు.

ఈ విధంగా రాష్ట్రాల్లో సైనిక పాలన సాగుతున్నది. హక్కుల ఉల్లంఘనలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో సైనిక, పారామిలిటరీ బలగాల చేతిలో వేలాది మంది మరణించారు. కస్టడీ చావులు, మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. గ్రామాలను చుట్టుముట్టి సోదా పేరిట ప్రజల ఆస్తులను లూటీ చేయడం సాధారణమైంది.

ఆధారం లేకుండానే అరెస్టు..

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవించే హక్కును, భావ ప్రకటన స్వేచ్ఛను, శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛను, దేశంలో ఎక్కడైనా సంచరించే, ఏ వృత్తినైనా ఏ మతాన్నైనా స్వీకరించే వీలును, విచక్షణారహిత అరెస్టుల నుంచి రక్షణను ఈ చట్టం పౌరుల నుంచి హరిస్తున్నదని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. నేరం చేశాడని నిరూపితమయ్యే వరకు ఒక వ్యక్తిని నిరపరాధిగానే భావించాలని మన సాధారణ చట్టాలు చెబుతుండగా ఏ ఆధారం లేకుండా ఓ వ్యక్తిని అరెస్టు చేసే అధికారాన్ని, బలప్రయోగం చేసైనా నేరాన్ని ఒప్పించే వీలును ఈ ప్రత్యేక చట్టం కల్పిస్తున్నదని వీరు చెబుతున్నారు.

పైగా శత్రు సైన్యాలను మట్టుబెట్టడంలో అరితేరివుండే సైనికులకు శాంతి భద్రతల సమస్యను, రోజువారీ వ్యవహారాలను అప్పగించడం వల్ల వాళ్లు ప్రతి ఒక్కరినీ శత్రువులుగా, ఉగ్రవాదులుగా చూసే అవకాశం ఎక్కువని, ఫలితంగానే ఈశాన్యంలో, కాశ్మీర్లో బూటకపు ఎన్ కౌంటర్లు, పౌరులపై కాల్పులు, వేధింపులు, ఇతర హక్కుల ఉల్లంఘనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.

మానవహక్కుల సంఘాల వ్యతిరేకత..

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కూడా ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వలసవాద యుగానికి చెందిన కాలం చెల్లిన ఈ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని సమితికి చెందిన మానవ హక్కుల కమిషనర్ నవనీతం డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి, అణచివేతకు, వివక్షకు ఈ చట్టం సాధనంగా మారిందని హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించాయి. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ రెడ్ క్రాస్ ధృవీకరించింది. భారత రక్షణ వ్యవహారాల అధ్యయన సంస్థ(ఐడీఎస్ఏ) సైతం సైనిక బలగాలు హద్దుమీరి అధికార దుర్వినియోగం చేస్తున్నాయని స్థానికులు విశ్వసిస్తున్నారని తన నివేదికలో పేర్కొంది.

తన లీకులతో సంచలనాలు సృష్టిస్తున్న వికీలీక్స్ సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం విషయంలో కూడా నమ్మలేని కొన్ని నిజాలను బహిర్గతం చేసింది. ఈశాన్యంలో, కాశ్మీర్లో నిర్బంధితులను తీవ్రంగా కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం సాధారణమైందని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, మణిపూర్ అస్సాం రైఫిల్స్ దౌర్జన్యాలను ఆ రాష్ట్ర గవర్నరే స్వయంగా అంగీకరించారని ఈ కేబుల్స్ వెల్లడిస్తున్నాయి.

ఐదుగురు సభ్యుల కమిషన్..

ఈశాన్యంలోను, జమ్ము-కాశ్మీర్లోను నిరసన వెల్లువ పెల్లుబికింది. మెజారిటీ ప్రజల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా భారత ప్రభుత్వం తమ రాష్ట్రాలను కుట్రపూరితంగా ఆక్రమించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను సైనికంగా అణచివేయడానికి వ్యతిరేకంగా ఈశాన్యంలో ఎన్నో పోరాట సంస్థలు పుట్టుకొచ్చాయి. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేయాలని ఉద్యమాలు చేశాయి. 2000లో షర్మిల దీక్ష, 2004లో మరో మణిపురీ మహిళ మనోరమను అస్సాం రైఫిల్స్ బలగాలు బంధించి అత్యాచారం చేసి చంపడం నేపథ్యంలో ఈ చట్టాన్ని వెంటనే ఎత్తిచేయాలన్న డిమాండ్ తీవ్రమైంది.

ఫలితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ చట్టంలోని అమానవీయ అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు జస్టిస్ బీ పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిషన్ను ఏర్పాటుచేసింది. 2005 జూన్ 6న కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఈ చట్టాన్ని మానవీయం చేస్తామని 2006 డిసెంబర్లో ప్రధాని ప్రకటించారు. అయితే ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ మన్మోహన్ హామీ బుట్టదాఖలే అయింది. ఈ చట్టం ఎత్తివేతను రక్షణ మంత్రి, సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

సాయుధ పోరాట విరమణ ప్రకటన..

ఇంత దుర్మార్గమైన చట్టం మరొకటి లేదని అంతర్జాతీయ సమాజం, దేశీయ మానవ హక్కుల సంస్థలు కోడై కూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పొడిగిస్తూనే ఉన్నది. ఇటీవలికాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో మామూలు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర హోం శాఖ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. గత పదేళ్లలో ఈ రాష్ట్రాల్లో జరిగిన హింస కూడా తక్కువే. అనేక పోరాట సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని సాయుధ పోరాట విరమణను ప్రకటించాయి.

కాశ్మీర్లో సైతం ఉగ్రవాదుల చర్యలు తగ్గిన ఫలితంగా సర్కారు పాక్షికంగా బలగాలను ఉపసంహరించుకున్నది. ఈ నేపథ్యంలో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేసే విషయంలో మన్మోహన్ ప్రభుత్వం చర్యలు చేబట్టాలి. పౌరుల ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించి అన్ని రంగాల్లో న్యాయం చేసినప్పుడే శాంతి నెలకొంటుందని గుర్తించాలి.

  • డి మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News