Tuesday, July 9, 2024

నల్లధనం.. తెల్ల బతుకులు..

భారతీయులకు చెందిన సుమారు రూ. 25 లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో నిలువ వున్నదని ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఏ పీ సింగ్ వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిలో మన దేశ కుబేరులదే అగ్రస్థానమని కూడా ఆయన తెలిపారు. సింగ్ ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. మీడియాలో ఈ అంశంపై చర్చోపచర్చలు చోటుచేసుకున్నాయి. నల్లధనాన్ని వెనక్కి తేగలిగితే దేశం అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతుందని, అగ్రరాజ్యంగా మారుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనాభాలో సగం వరకు ఉన్న పేదలకు ఈ మొత్తాన్ని పంచగలిగితే తెల్ల కార్డు బతుకుల రాత రాత్రికి రాత్రి మారిపోతుందని చెప్పుకొచ్చారు.

కాగా, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెంటనే వెనక్కి తెప్పించాలని బీజేపీ తదితర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండుతో తమ పార్టీ సైతం ఏకీభవిస్తున్నదని, డబ్బును వెనక్కి రప్పించడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నల్లధనం అంశం కీలకంగా మారింది. బీఎస్పీ, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు సైతం ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి.

డబ్బంతా స్విస్ బ్యాంకుల్లోనే..

అయితే.. నల్లధనంపై చర్చ కొత్తదేం కాదు. ఆ మాటకొస్తే భారీ కుంభకోణాలు చేసిన ప్రముఖులు అక్రమంగా సంపాదించిన డబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారనే విషయం దేశంలో చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. ఎన్నికల సమయంలో వైరిపక్షాలను, వ్యతిరేకులను అపఖ్యాతిపాలు చేయడానికి నల్లధనాన్ని అస్త్రంగా వాడుకోవడం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. సమయ సందర్భాలను బట్టి కొంతకాలం ఈ అంశంపై మీడియాలో, ప్రజల్లో చర్చ జరగడం, తర్వాత మర్చిపోవడం షరా మామూలైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని వివిధ దేశాల్లో భారతీయులు దాచుకున్న డబ్బు రూ. 120 లక్షల కోట్లు కాగా, మరో రూ. 150 లక్షల కోట్ల వరకు దేశ ఆర్థిక వ్యవస్థ లోపల బ్లాక్ మనీ రూపంలో ఉంది. ఈ డబ్బును లోక్సభ నియోజకవర్గాల వారీగా పంచితే ఒక్కో నియోజకవర్గానికి రూ.50 వేల కోట్ల వరకు నిధులు అందివ్వవచ్చు. దేశానికున్న అన్ని రకాల అప్పులను తీర్చవచ్చు. పేదలు ధనికులనే తేడా లేకుండా భారతీయులందరికీ పంచినా తలా ఒక్కంటికి రూ. రెండు లక్షల 25 వేలు వస్తుంది.

మన దేశానిదే అగ్రస్థానం..

2006లో స్విస్ బ్యాంక్ అసోసియేషన్ అధికారిక లెక్కల ప్రకారం స్విట్జర్లాండ్ లోని వివిధ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు నిల్వల్లో భారత్ అగ్రస్థానం. భారతీయుల డబ్బు రూ. 72 లక్షల 80 వేల కోట్లు ఉంది. రూ. 23 లక్షల 50 వేల కోట్లతో రష్యా రెండవ స్థానంలో, రూ.19 లక్షల 50 వేల కోట్లతో బ్రిటన్ మూడవ | స్థానంలో, 5 లక్షల కోట్లతో ఉక్రెయిన్ నాల్గవ స్థానంలో, రూ. 4 లక్షల 80 వేల కోట్లతో చైనా ఐదవ స్థానంలో ఉన్నాయి.

విచిత్రమేమిటంటే మిగతా ప్రపంచ దేశాలన్నింటి నల్లధనాన్ని కలిపినా భారతీయులతో సాటిరాని పరిస్థితి ఉంది. ఒక్క స్విస్ బ్యాంకుల్లోనే ఇంత డబ్బు ఉంటే ఇక మారిషస్, సింగపూర్, దుబాయ్, న్యూజీలాండ్, వర్జిన్ ఐలాండ్స్, సెషెల్స్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోని బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనానికి లెక్కల్లేవు.

ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు..

మధ్యయూరపులోని అతిచిన్న దేశం లీచ్టెన్స్టెయిన్కు చెందిన ఎల్జీటీ బ్యాంకులో అక్రమంగా డబ్బు దాచుకున్న 18 మంది భారతీయుల జాబితాను 2009 మార్చిలో జర్మనీ మన కేంద్ర ప్రభుత్వానికి అందించింది. గత సంవత్సరం జనవరిలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం వివిధ విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనం నిల్వల గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయింది. జర్మనీ అందించిన జాబితాను బయటికి వెల్లడించకపోవడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించింది. ఈ దిశలో వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

బ్లాక్ మనీ అంటే..?

అసలు నల్లధనం అంటే ఏమిటి? ఆదాయపు పన్ను సహా ఏ ఇతర పన్నులు చెల్లించకుండా, ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా దాచుకున్న సొమ్మును నల్లధనంగా వ్యవహరిస్తారు. విదేశీ బ్యాంకుల్లో ఇది డిపాజిట్ల రూపంలో ఉంటే దేశీయంగా అక్రమ లావాదేవీలతో పోటీ ఆర్థిక వ్యవస్థను నడుపుతుంటుంది. ధనం అంటే ఒక్క కరెన్సీ (రూపాయలు లేదా డాలర్లు వగైరా) రూపంలోనే ఉండనక్కరలేదు.

బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు తదితర విలువైన లోహాల రూపంలో ఉన్నా, ఇతర వస్తువులు, ఆస్తుల రూపంలో ఉన్నా, పన్నులు చెల్లించకుండా, లెక్కలు చూపకుండా ఉంటే అది నల్లధనంగానే పరిగణించబడుతుంది. అక్రమ, చట్టవిరుద్ధ లావాదేవీల ద్వారానే నల్లధనం సృష్టించడం సాధ్యమవుతుంది.

భారీగా డబ్బు కేటాయింపులు జరిగే అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, షేర్ మార్కెట్, ఎగుమతులు-దిగుమతుల వ్యాపారం, ఇతర వర్తక వాణిజ్యాల్లో దొంగ లెక్కలు చూపడం ద్వారా ఆయా వ్యక్తులకు నల్లధనం సమకూరుతుంది. సూటిగా చెప్పాలంటే నల్లధనానికి మూలం కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు, దోపిడీ.. విశ్లేషకుల అంచనా ప్రకారం దేశంలో నల్లడబ్బు కలిగివున్నవారిలో అగ్రస్థానం రాజకీయ నాయకులది కాగా, తర్వాతి స్థానం హవాలా వ్యాపారులది. ఈ జాబితాలో స్మగ్లర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, సినీతారలు, క్రికెట్ ఆటగాళ్లు ఉన్నారు.

పేదరికంలోనూ టాప్..

నల్లధనం చర్చ వస్తే వెంటనే ఎవరికైనా గుర్తుకువచ్చేది మన దేశంలో ఉన్న పేదరికం. లక్షల కోట్లు అలా విదేశీ బ్యాంకుల్లో పడివుంటే దేశంలో దారిద్య్రం ఉండడమేమిటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ప్రపంచంలో ఉన్న మొత్తం పేదల్లో మూడవ భాగం ఇక్కడే ఉన్నారు. 2005లో ప్రపంచ బ్యాంకు వేసిన అంచనా ప్రకారం భారత జనాభాలో 41.6 శాతం మంది అంతర్జాతీయ దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్నారు.

ప్లానింగ్ కమిషన్ నియమించిన టెండూల్కర్ కమిటీ దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నవారు 37 శాతంగా పేర్కొనగా, ఎన్సీ సక్సేనా నేతృత్వంలోని మరో కమిటీ 50 శాతంగా అంచనా వేసింది. అసంఘటిత కార్మిక రంగానికి చెందిన జాతీయ కమిషన్ లెక్కల ప్రకారం(అర్జున్సేన్ గుప్తా నివేదిక) 77 శాతం భారతీయులు రోజుకు కేవలం 20 కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు.

పెరిగిన ఆకలిచావులు..

2001 జనాభా లెక్కల ప్రకారం రేడియో, టీవీ, సైకిల్, మోపెడ్, ఫోన్, బ్యాంక్ అకౌంట్ వంటి సౌకర్యాలేవీ లేని కుటుంబాలు దేశంలో 34.5 శాతం ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పేదరికం, మానవాభివృద్ధి విభాగం చేసిన అధ్యయనంలో కూడా 53.7 శాతం భారతీయులు పేదరికంలో మగ్గుతున్నారు. వీరిలో 28.6 శాతం కడుపేదలు. ఒక అంచనా ప్రకారం కేవలం ఉత్తర తూర్పు భారతంలోని 8 రాష్ట్రాల్లో ఉన్న పేదల సంఖ్య ఆఫ్రికాలోని 26 దేశాల పేదల సంఖ్య కంటే ఎక్కువ. ఇక, ప్రపంచవ్యాప్తంగా పోషకాహారం లోపించిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఇక్కడే ఉన్నారు.

ఐదేళ్ల లోపు పిల్లల్లో 42 శాతం మంది భారహీనతతో బాధపడుతున్నారు. 2011 ప్రపంచ ఆకలి సూచిక లో మన దేశం 45వ స్థానం ఆక్రమించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్, ఉగాండా, జింబాబ్వే వంటి పేద దేశాల పరిస్థితి కూడా మెరుగుపడుతుండగా మనం మాత్రం 22.9 నుంచి 23.7 పాయింట్లకు ఎగబాకి ఆకలిచావుల సంఖ్యను పెంచుకుంటున్నాం.

కుంభకోణాలే మూలం..

పెరుగుతూనేవున్న నల్లధనానికి, తగ్గకుండా ఉన్న పేదరికానికి మధ్య అవినాభావ సంబంధాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పేదలకని పలు పథకాల కోసం, ప్రాజెక్టుల కోసం విడుదల చేసిన తెల్ల కరెన్సీ వారికి చేరకుండా పేదరికాన్ని పెంచితే, అదే కరెన్సీ 2జీ, 3జీ తదితర కుంభకోణాల రూపంలో పెద్దల జేబుల్లోకెళ్లి నల్ల డబ్బుగా పరిణామం చెందుతున్నది. స్విస్ బ్యాంకులను చేరుతున్నది. ప్రభుత్వాలను శాసిస్తున్నది. పార్టీలను బతికిస్తున్నది.

అందుకే నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామంటున్న అధికారపక్షమైనా, ఈ డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదరిక నిర్మూలన పథకాలకు ఖర్చు పెట్టాలని డిమాండు చేసే ప్రతిపక్షాలైనా తమ మాటపై నిలబడడం సాధ్యం కాదని చెప్పొచ్చు. నల్లధనం పుట్టుక, పెరుగుదల, నిర్మూలన అంశాలను అధ్యయనం చేయడానికి 2011 జూన్లో కేంద్రం నియమించిన కమిటీ సమర్పించిన నివేదికతో ఈ విషయం తేటతెల్లమైంది. నివేదికలో కొన్ని సంచలన విషయాలున్నాయి.

ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు..

తమ సంవత్సరాదాయం రూ.500 కోట్లుగా చూపుతున్న ఒక ప్రధాన పార్టీ, రూ.200 కోట్లుగా చూపుతున్న మరో ప్రధాన పార్టీ (కాంగ్రెస్, బీజేపీలని వేరే చెప్పనక్కరలేదు) కేవలం ఎన్నికల కోసమే 10 వేల నుంచి 15 వేల కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాయంటే నల్లధనం పడగ నీడలోనే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదని ఈ నివేదిక తేల్చిచెప్పింది.

అవినీతి నిర్మూలన చట్టాలను మరింత కఠినతరం చేయాలని, శిక్షలు పెంచాలని, పకడ్బందీ పన్నుల విధానాన్ని అమలు చేయడానికి జాతీయ పన్నుల ట్రిబ్యునల్ను ఏర్పరచాలని, నిర్ణీత పరిమితి దాటిన విదేశీ లావాదేవీలను పసిగట్టేందుకు వీలుగా అమెరికా దేశభక్తుల చట్టం తరహాలో ఒక చట్టాన్ని ఆమోదించాలని కమిటీ సూచించింది. అయితే, పైన పేర్కొన్న రెండు ప్రధాన పార్టీలే ఈ నివేదికను అమలు చేయడంలో కీలకం కనుక నల్ల కుబేరులు నిశ్చింతగానే ఉన్నారు.

నల్ల ధనంతో తెల్ల బతుకులను మార్చాలన్నా, అవినీతి, అక్రమాలు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలన్నా బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణమొక్కటే మార్గం. విదేశీ బ్యాంకుల్లో స్వదేశీ ఆర్థిక వ్యవస్థలో ఉన్న నల్ల ధనాన్ని జాతీయ సంపదగా ప్రకటించి స్వాధీనం చేసుకోవాలి. ఈ డబ్బును పేదరిక నిర్మూలన పథకాలకు ఖర్చు పెట్టాలి. అవినీతిపరులను ఉరితీసే విధంగా చట్టాలను సవరించాలి. నిధులు కేటాయింపులో, పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని, పారదర్శకతను పెంచి పన్నుల వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలి. ఈ దిశలో ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఉద్యమాలు నిర్మించాలి. పాలకులపై ఒత్తిడి తెచ్చి జాతి సంపదను జాతిపరం చేయాలి.

 

  • డి మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News