Wednesday, July 3, 2024

అమెరికాలో ఇప్పటికీ బానిస వ్యవస్థ!

ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాలో సరికొత్త వ్యాపారం వర్ధిల్లుతోంది. జైళ్లలో ఉండే ఖైదీలను కట్టుబానిసలుగా మార్చి బహుళజాతి కంపెనీలు వందల కోట్లు గడిస్తున్నాయి. శతాబ్దాల క్రితం డబ్బూ మందీ మార్బలం ఉన్న తెల్ల దొరలు ఆఫ్రికా అడవుల నుంచి నల్ల జాతీయులను బంధించి తెచ్చి బానిసలుగా ఉపయోగించుకోవడం గురించి మనకు తెలుసు. కాని కుట్రపూరితంగా నేరాలను ప్రోత్సహిస్తూ, తదనుగుణంగా చట్టాలనూ, శిక్షలనూ ఇష్టానుసారం మార్చుకుంటూ ఖైదీలను నయా బానిసలుగా ఉపయోగించుకుంటున్న వైనం చాలా తక్కువ మందికి తెలుసు.

ఆ దేశంలోని ఫెడరల్, స్టేట్, కౌంటీ, ప్రైవేట్ జైళ్లలో ఉన్న సుమారు 23 లక్షల మంది ఖైదీలు రాత్రిళ్లు ఇరుకు గదుల్లో మగ్గుతూ పగటి పూట వివిధ పరిశ్రమల్లో నామమాత్రపు వేతనాలకు పని చేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు ఈ జైళ్లతో కాంట్రాక్టు కుదుర్చుకుని లేదా తామే జైళ్లను నిర్వహిస్తూ సుమారు 30 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసుకుంటున్నాయి.

స్వేచ్ఛ లేదు.. ఓటు హక్కు లేదు..

కనీస వేతన చట్టం ప్రకారం గంటకు 7.25 డాలర్ల చొప్పున ఇవ్వాల్సివుండగా ఈ ఖైదీ శ్రామికులకు గంటకు 20 నుంచి 50 సెంట్లు మాత్రమే చెల్లిస్తున్నారు. నాటి బానిసల్లాగే వీరికి స్వేచ్ఛ లేదు. ఓటు హక్కుతో సహా ఎలాంటి హక్కులు లేవు. ప్రశ్నించే అధికారం లేదు. ఎదురు తిరిగితే గొడ్డును బాదినట్లు బాదుతారు. ఏ కంపెనీలో పని చేయాలి? ఎంత కూలీకి పని చేయాలి? ఎన్ని గంటలు పని చేయాలి? ఇవేవీ వీరి చేతుల్లో ఉండవు.

తిండి కూడా యజమానుల భిక్షే. జ్వరమొచ్చినా పట్టించుకునే నాథుడుండడు. జైలు పరిశ్రమల అభివృద్ధి పేరుతో రిపబ్లికన్ రీగన్ హయాంలో మొదలైన ఈ నయా వ్యాపారం డెమోక్రాట్ క్లింటన్ పాలనలో బాగా విస్తరించింది. నల్ల సూరీడుగా వినుతికెక్కిన ఒబామా నేతృత్వంలో ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ కొత్త వ్యాపారంతో పుంజుకోజూస్తున్నది.

13వ రాజ్యాంగ సవరణ కీలకం..

ఈ బానిస వ్యాపారం ఉనికిలోకి రావడానికి బీజం 1980లలోనే పడింది. సంక్షోభం సుడిలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేయడానికి స్వేచ్ఛా విపణి సిద్ధాంతం ప్రాతిపదికగా అభివృద్ధి పేరుతో, అవుట్ సోర్సింగ్ పేరుతో, సెజ్‌ల పేరుతో మూడవ ప్రపంచ దేశాల కార్మికశక్తిని కొల్లగొట్టడంతో పాటు స్వదేశంలోని జైళ్లలో మగ్గుతున్న లక్షలాది మంది ఖైదీలను ఉపయోగించుకోవడానికి అమెరికన్ ప్రభుత్వం, బహుళజాతి సంస్థలు వ్యూహాలు రచించాయి. బానిస వ్యవస్థను రద్దు చేస్తూనే ఖైదీలకు మినహాయింపునిచ్చిన 13వ రాజ్యాంగ సవరణను, తర్వాతి కాలంలో ఆ సవరణకు తూట్లు పొడుస్తూ దొడ్డిదారిన పెట్టుబడిదారులు అమలు చేసిన ఖైదీలను లీజుకు తీసుకునే పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త చట్టాలకు, విధానాలకు శ్రీకారం చుట్టాయి.

బహుళజాతి సంస్థలు, చట్టసభల ప్రతినిధులతో కలిపి ఏర్పాటుచేసిన ‘ది అమెరికన్ లెజిస్లేటర్స్ ఎక్స్చేంజ్ కౌన్సిల్’ ఈ విధానాల రూపకల్పనకు వేదికైంది. ప్రిజన్ ఇండస్ట్రీస్ యాక్ట్, ప్రిజన్ ఇండస్ట్రీస్ ఎన్‌హాన్స్మెంట్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం తదితర చట్టాలు ఈ కాలంలోనే ఆమోదం పొందాయి. ఈ చట్టాల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న, అలాగే ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్న జైళ్లలోని ఖైదీలతో నిర్వాహకులు పని చేయించుకోవచ్చు. పనిచేయ నిరాకరించిన వారిని వివిధ రకాల ఒత్తిడులకు గురి చేసే అధికారాన్ని ఈ చట్టాలు కల్పించాయి. వేతనాల రూపంలో వచ్చిన డబ్బును జైలు నిర్వహణ కోసం ఉపయోగించవచ్చు. ప్రైవేట్ కంపెనీలయితే లాభాలు రాబట్టుకోవచ్చు.

ఖైదీల సంఖ్యను పెంచే విధానాలు..

ఖైదీల సంఖ్యాబలాన్ని పెంచడానికి కూడా కొత్త చట్టాలను, విధానాలను అమలులోకి తెచ్చారు. తీవ్రమైన నేరాలు మూడుసార్లు చేసిన వారిని జీవితాంతం జైలులోనే ఉంచే చట్టం ఇందులో ఒకటి. దీంతో పాటు మత్తు పదార్థాలపై యుద్ధం పేరుతో ఒక కేంపెయిన్ ప్రారంభించారు. అతి తక్కువ పరిమాణంలో మత్తు పదార్థాలను కలిగివున్నా 5 నుంచి 10 ఏళ్ల ఖైదును విధించే అధికారం కోర్టులకిచ్చారు.

5 గ్రాముల రాక్ కొకెయిన్ లేదా 110 గ్రాముల హెరాయిన్ కలిగివున్నవారికి పెరోల్ లేకుండా ఐదేళ్ల శిక్ష, రెండు ఔన్సుల కంటే తక్కువ పరిమాణంలో రాక్ కొకెయిన్‌ను కలిగివున్న వారికి పదేళ్ల శిక్ష, 500 గ్రాముల కొకెయిన్‌ను కలిగివున్న వారికి ఐదేళ్ల శిక్ష విధించడానికి ఈ చట్టాలు వీలు కల్పిస్తాయి. విచిత్రమేమిటంటే తెల్ల దొరలు, ధనిక వర్గాలు ఎక్కువగా ఉపయోగించే కొకెయిన్ 500 గ్రాములు దొరికినా, నల్ల జాతీయులు, పేద మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వాడే రాక్ కొకెయిన్ 5 గ్రాములు దొరికినా ఒకటే శిక్షట. ఇక్కడే అమెరికన్ పాలకుల వివక్ష నగ్నంగా బయటపడుతుంది.

జైలు పరిశ్రమ గ్రోత్ ఫాస్ట్..

దరిమిలా అమెరికాలో రెండు ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. జైళ్లలో శిక్షననుభవిస్తున్న ఖైదీలతో వారికిష్టమున్నా లేకున్నా పని చేయించడం మొదలైంది. కేంద్ర, రాష్ట్రాల జైళ్లలో వివిధ పరిశ్రమలను స్థాపించి అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేయనారంభించారు. అనతికాలంలోనే ఈ జైలు పరిశ్రమలు అతివేగంగా అభివృద్ధి చెందాయి. వాల్ట్లో ఈ పరిశ్రమల షేర్లకు డిమాండ్ పెరిగింది. లెఫ్ట్ బిజినెస్ అబ్జర్వర్ పత్రిక ప్రకారం మిలిటరీ ఉపయోగించే హెల్మెట్లు, ఆమ్యునిషన్ బెల్టులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తదితరం నూటికి నూరు శాతం ఈ పరిశ్రమలే సరఫరా చేస్తున్నాయి.

సైనికేతర ఉత్పత్తుల్లో పరికరాల అసెంబ్లీయింగ్‌లో 98 శాతం, పెయింట్లు, బ్రష్ తయారీలో 93 శాతం, స్టౌలలో 92 శాతం, దేహధారణ వస్తువుల్లో 46 శాతం, గృహోపకరణాల్లో 36 శాతం, స్పీకర్లు, మైక్రోఫోన్లు, హెడ్ఫోన్‌లలో 30 శాతం, ఆఫీస్ ఫర్నిచర్‌లో 21 శాతం మార్కెట్ వాటాను ఈ పరిశ్రమలు కలిగివున్నాయి. విమానాల విడిభాగాలు.. మందులు.. కాల్ సెంటర్ ఆపరేటర్లు.. చివరకు అంధులకు దారి చూపే శునకాలను పెంచే పనిని కూడా ఖైదీలు చేస్తున్నారు.

జైళ్ల ప్రైవేటీకరణ..

జైళ్ల ప్రైవేటీకరణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అమెరికాలో మొట్టమొదటి ప్రైవేట్ జైలు 1984లో నిర్మితమైంది. కరెక్షన్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా (సీసీఏ) పేరుతో ఓ బహుళజాతి కంపెనీ స్థాపించిన సంస్థ జైళ్లను నిర్మించి నిర్వహించడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అప్పటి నుంచి ప్రైవేట్ రంగం వేగంగా విస్తరించింది. 1987లో ప్రైవేట్ జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య కేవలం 3,122 కాగా 2010 కల్లా ఆ సంఖ్య లక్షా 20 వేలకు చేరుకుంది.

స్మిత్-బార్నీ, అమెరికన్ ఎక్స్ప్రెస్, జనరల్ ఎలక్ట్రిక్, ఏటీ అండ్ టీ, స్ప్రింట్ వంటి పేరొందిన సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం అక్కడ తక్కువ మంది గార్డులతో ఎక్కువ మంది ఖైదీలకు కాపలా కాసే అత్యాధునిక వ్యవస్థ కలిగిన సూపర్ మ్యాక్స్ జైళ్ల యుగం నడుస్తోంది. శ్రమశక్తిపై తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు ఆర్జించే ఉద్దేశంతో బహుళజాతి సంస్థలు ప్రైవేట్ జైళ్ల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి.

ఖైదీల శ్రమ దోపిడి..

వివిధ కౌంటీల్లో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను రకరకాలుగా ఆశలు చూపి లొంగదీసుకోవడం, తాము పెట్టాలనుకున్న పరిశ్రమను నెలకొల్పడం, దాని చుట్టూ హై సెక్యూరిటీ వాల్ నిర్మించి జైలుగా మార్చడం, కోట్లల్లో లాభాలు ఆర్జించడం ఇప్పుడక్కడ సర్వసాధారణమైంది. తాము ఒప్పందం కుదుర్చుకున్న కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం సుంచి ఒక్కో ఖైదీకి రోజుకు 50 డాలర్ల చొప్పున ప్రైవేట్ జైలు కంపెనీలు వసూలు చేస్తాయి. ఖైదీలు పారిపోకుండా భద్రతావ్యవస్థను ఏర్పరచడంతో పాటు తిండి, బట్టలు, వైద్యం తదితర బాధ్యతలన్నీ ఈ కంపెనీలవే.

కాగా, తమ జైలులో ఉన్న ఖైదీలతో ఆ కంపెనీ పని చేయించుకోవచ్చు. తనే స్వయంగా ఓ పరిశ్రమను స్థాపించి అందులో పని చేయించవచ్చు లేదా మరో సంస్థకు వీరి శ్రమశక్తిని అమ్ముకోవచ్చు. ఎంతటి లాభాలైనా గడించవచ్చు. సహజంగానే ఖైదీల తిండికి, బాగోగులకయ్యే వ్యయాన్ని ఈ కంపెనీలు బాగా తగ్గించి వారి శ్రమతో ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ప్రభుత్వ జైళ్ల నిర్వహణ బాధ్యతలు చూసే అధికారులు కూడా తక్కువ తినలేదు.

ప్రైవేట్ జైలు కంపెనీలకు దీటుగా తమ జైళ్లలో ఉన్న ఖైదీలను పోటీపడి మరీ బహుళజాతి సంస్థల్లో పని చేయడానికి వీలుగా విధానాలను ఆమోదింపజేసుకున్నారు. స్వయం పోషణ పేరుతో నిర్వహణ ఖర్చులను తగ్గిస్తున్నామని చెబుతూ ఖైదీలను కాంట్రాక్టుకు ఇచ్చి ఆ సంస్థల నుంచి కమీషన్లు దండుకుంటున్నారు. అమెరికాలోని 37 రాష్ట్రాలు జైలు ఖైదీలను పని కోసం ప్రైవేట్ కంపెనీలు కాంట్రాక్టుకు తీసుకోవడాన్ని చట్టబద్ధం చేశాయి.

ఐబీఎం, బోయింగ్, మోటరోలా, మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ, డెల్, కంపాక్, నోర్రెల్, ఇంటెల్, త్రీకామ్ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలన్నీ వివిధ జైళ్ల ఖైదీలతో పని చేయించుకుంటున్నాయి. అలా ప్రైవేట్, ప్రభుత్వ జైళ్ల నిర్వాహకుల మధ్య లాభాల కోసం కొనసాగిన పోటీ అమెరికన్ ప్రభుత్వాల ఫ్రీ మార్కెట్ విధానాల దన్నుతో నయా బానిసల వ్యవస్థ వేళ్లూనుకుని విజయవంతంగా కొనసాగుతున్నది.

అమెరికాదే అగ్రస్థానం..

ఖైదీలను కార్మికులుగా మార్చి వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పి లేదా వారి శ్రమశక్తిని కాంట్రాక్టుకు అమ్ముకుని ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు కోట్లాది డాలర్లు గడిస్తున్నాయి. ఓపెన్ మార్కెట్లో గంట పనికి కనీస వేతనం 7.25 నుంచి 50 డాలర్ల వరకు చెల్లిస్తుండగా ఈ ఖైదీలకు నామమాత్రపు వేతనాలు చెల్లిస్తున్నాయి. ఫలితంగా ఖైదీల సంఖ్య దినదినం పెరుగుతున్నది. ఖైదీల సంఖ్యలో ప్రపంచంలోనే అమెరికాది అగ్రస్థానం. 1970లతో పోల్చితే ఇక్కడి వివిధ జైళ్లలో ఉన్నవారి సంఖ్య 2010కల్లా ఏడు రెట్లు పెరిగింది. 2010లో అమెరికాలో వివిధ నేరాల కింద నిర్బంధితులు 71 లక్షల 63 వేల మంది ఉన్నారు. నేరాలు చేసేవారి సంఖ్య ఏటా 1.9 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నది.

ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రపంచ దేశాలకు నీతులు బోధించే అమెరికాలో ఇలాంటి నీచమైన వ్యవస్థ కొనసాగుతుండడం సిగ్గుచేటు. నియంతలనీ, అరాచకాలు చేస్తున్నారనీ, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనీ పలు సాకులతో ఇరాక్ మొదలుకొని లిబియా వరకు ఎన్నో దేశాలపై పాశవికంగా దాడి చేసిన అమెరికా మొదట తన ప్రజలపై ముఖ్యంగా నల్ల జాతీయులు, శ్వేతజాతేతరుల పైన కొనసాగిస్తున్న వివక్షను ఆపాలి. మానవ హక్కుల సంస్థలు, వామపక్ష మేధావులు చేస్తున్న ఆరోపణలు పట్టించుకుని తన జాత్యహంకార విధానాలకు స్వస్తి చెప్పాలి. లేదంటే ప్రపంచ ప్రజానీకం దేశాన్ని మరింత ద్వేషించడం, ప్రతిఘటనకు సిద్ధం కావడం తప్పదు.

  • డి మార్కండేయ

(నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీ సౌజన్యంతో..)

Latest News