Tuesday, July 9, 2024

పథకాలు పేదోళ్లకా? పెద్దోళ్లకా?

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. వైఎస్ఆర్ పాలనలోనే పింఛన్ల పెంపు, రుణమాఫీ వంటి స్కీంలు మొదలుకాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యాక కేసీఆర్ జమానాలో వాటి రాసీ వాసీ బాగా పెరిగింది. 2021 జూన్ 2 నాటికి రాష్ట్రంలో మొత్తం 39.07 లక్షల మంది ఆసరా పథకం కింద వివిధ రకాల పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. వీరిలో 13లక్షల మంది వృద్ధులకు, 14లక్షల మంది వితంతువులకు, 1.20లక్షల ఒంటరి మహిళలకు, 4.17లక్షల బీడీ కార్మికులకు, 35వేల నేతన్నలకు, 60వేల కల్లుగీత పనివాళ్లకు, 16వేల బోధకాలు, 32వేల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ. 2016 చొప్పున, 4.94లక్షల మంది వికలాంగులకు, 43వేల మంది వృద్ధ కళాకారులకు రూ.3016 చొప్పున ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. పది వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. 2018 ముందస్తు ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ప్రస్తుత(2021) రబీ సీజన్‌లో మొత్తం 63.25లక్షల రైతులు కోటీ యాభై లక్షల ఎకరాలకు గానూ రూ. 7508 కోట్ల లబ్ధి పొందుతారు. ఏటా ఈ పథకానికయ్యే ఖర్చు అక్షరాలా 15వేల కోట్లు. ఇక రైతుబీమాతో 32లక్షల కుటుంబాలు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్ కింద 6లక్షలు, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంటు కింద 4లక్షలు, గొర్రెల పంపిణీ కింద 3.76లక్షలు, బర్రెల పంపిణీ కింద మరో లక్షకు పైగా, చేపపిల్లల పెంపకంతో 1.50లక్షలు, ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 2లక్షల కుటుంబాలు సర్కారు ఖజానా నుంచి వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం పొందుతున్నాయి. పలు జిల్లాల్లో వేలాది డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్యలక్ష్మి, కంటివెలుగు, గర్భిణులకు కేసీఆర్ కిట్ అమలవుతున్నాయి. రైతులకు ట్రాక్టర్లు, ముదిరాజ్‌లకు టాటా ఏస్ వాహనాలు సబ్సిడీపై అందిస్తున్నారు. ఇటీవలే అర్హులైన ఎస్సీ కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందించే దళితబంధును కూడా సీఎం ప్రారంభించారు.

 

చాలా వివరంగా నేనిచ్చిన ఈ లెక్కలు మీకు ఫుల్ బోరింగ్‌గా ఉండచ్చు. ఆ లెక్కలు తెలువంది ఎవరికి అని కూడా అనిపించవచ్చు. ఇక్కడే అసలు తిరకాసు ఇక్కడే ఉంది. లెక్కకు మిక్కిలి అమలవుతున్న ఈ పథకాలన్నింటికీ కలిపి ఏటా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతోంది. అది మనందరం వివిధ రకాల పన్నుల రూపంలో కట్టిన మన సొమ్మే. 2014-15 నుంచి 2021-22 వరకు ఏడు రాష్ట్ర వార్షిక బడ్జెట్లలో ఇలాంటి సంక్షేమ పథకాల కోసం మొత్తం 3లక్షల 94వేల 517 కోట్ల రూ.లు కేటాయించారు. కేసీఆర్ మాటల్లో, ప్రభుత్వ ప్రకటనల్లో, జీఓల్లో చెప్పినట్లుగా ఈ అన్ని పథకాల లక్ష్యం ఒక్కటే. కష్టాల్లో, కన్నీళ్లలో, బాధల్లో ఉన్న.. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు లేని అభాగ్యులను, పేదలను ఆదుకోవడమే. ఒక్క రైతుబంధుకు తప్ప ఏ పథకానికి సంబంధించిన జీఓ చూసినా ఈ విషయమే నియమ నిబంధనల్లో ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి వివిధ డాక్యుమెంట్లను జత చేయమంటారు. ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును ఆధారంగా తీసుకుంటారు. కులం అవసరమైతే క్యాస్ట్, స్థానికత కావాలంటే నేటివిటీ, ఆదాయం కావాలంటే ఇన్‌కం సర్టిఫికేట్ అడుగుతారు. అతను పేదవాడా? కాదా? నిర్ణయించడం కోసం మాత్రం బేసిక్‌గా వైట్ రేషన్ కార్డును ప్రాతిపదికగా వాడుతారు. ఇతర నిబంధనలు వర్తించి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ పేదలకోసం ప్రవేశపెట్టిన ప్రతి ప్రభుత్వ పథకమూ మంజూరవుతుంది.

 

2021 జూన్ నాటికి తెలంగాణలో అంత్యోదయ అన్నయోజన(ఏఏవై-కేంద్ర పథకం) కింద 53లక్షల 67వేల 678 కార్డులు, అంత్యోదయ అన్నపూర్ణ(ఏఏపీ-రాష్ట్ర పథకం) కింద 36లక్షల 79వేల 472 కార్డులు కలిపి మొత్తం 90లక్షల 47వేల 150 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. మరో 4లక్షల 46వేల 169 కార్డులను కొత్తగా ఇవ్వాలని గత జూన్ 8న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది. కాగా, 2020 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో మొత్తం ఒక కోటి మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి. అనగా నూటికి 87.8శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఈ కుటుంబాల్లోని వ్యక్తుల నుంచే వివిధ రకాల పథకాల, స్కీముల నియమ నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. కేవలం 12.2శాతం అనగా 12లక్షల 52వేల 850 కుటుంబాలు మాత్రమే పేదరికంలో లేవన్నమాట. మరో 4లక్షల 46వేల మందికి కూడా ప్రస్తుతం కొత్తగా కార్డులు ఇస్తున్నారు కనుక ఈ సంఖ్య 10లక్షల దిగువకు చేరుకోవడం ఖాయం. అంటే తెలంగాణలో నూటికి కేవలం పది మంది మాత్రమే అధికారికంగా ధనికులు ఉన్నట్లు లెక్క.

 

2015లో కేంద్రం ప్రతిపాదించిన ప్రకారం నెలకు గ్రామీణప్రాంతాల్లో రూ. 1060, పట్టణప్రాంతాల్లో రూ. 1286 ఖర్చు చేసే స్థితిలో లేని కుటుంబాలు దారిద్ర్యరేఖకు (బీపీఎల్) దిగువన జీవిస్తున్నట్లు అర్థం. దేశ జనాభాలో కేవలం 6.7 శాతం ప్రజలు మాత్రమే దారిద్ర్యంలో బతుకుతున్నారని 2019లో మోడీ సర్కారు తెలిపింది. ఈ అర్హతల ప్రకారమే అంత్యోదయ అన్నయోజన కార్డులు జారీ కావాలి. అయితే, ఈ కార్డులు మంజూరు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే కనుక ఒక్కోచోట ఒక్కోరకం నిబంధనలు అమలవుతున్నాయి. మన తెలంగాణలో 52శాతం కుటుంబాలకు ఈ కార్డులున్నాయి. ఇక, రాష్ట్రానికి వస్తే, తెల్ల రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణప్రాంతాల్లో ఏడాదికి రూ.60వేలు, పట్టణప్రాంతాల్లో రూ.75వేలు సంవత్సరాదాయ పరిమితిగా ఉండింది. తెలంగాణ ప్రభుత్వం 2015లో ఈ పరిమితిని పెంచింది. ప్రస్తుతం పల్లెల్లో ఏటా రూ.1.50లక్షలకు, పట్టణాలు, నగరాల్లో రూ.2లక్షలకు మించని ఆదాయం ఉన్నవాళ్లకు ప్రస్తుతం అంత్యోదయ అన్నపూర్ణ పథకం కింద వైట్ కార్డులు(ఆహార భద్రతకార్డులు) జారీ చేస్తున్నారు. అనగా జనాభాలో మరో 35.7శాతానికి ఈ తరహా కార్డులున్నాయి.

 

ఇప్పుడు నాణానికి మరోవైపు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రైతుబంధు లెక్కల ప్రకారం తెలంగాణలో మూడెకరాల పైబడి భూమి ఉన్న రైతు కుటుంబాలు 16లక్షల 72వేలు ఉన్నాయి. 2014లో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డాటా (2019లో విడుదలైంది) కొన్ని సంచలన నిజాలను బయటపెట్టింది. ఈ వివరాల ప్రకారం కూడా మూడెకరాలకు పైబడిన రైతులు 13లక్షల 47వేలున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 8లక్షల 37వేలు. మరో 9లక్షల 13వేల మంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరుకాకుండా ప్రభుత్వోద్యోగం చేసి రిటైరై నెలనెలా పెన్షన్ అందుకుంటున్న కుటుంబాల సంఖ్య 3లక్షల 17వేలు. ఇక ఏడాదికి ఐదు లక్షలకు మించి రాబడి వుండి ఆదాయపు పన్ను కడుతున్న కుటుంబాల సంఖ్య 7లక్షల 6వేలు. భారీ వ్యాపారం చేస్తున్న వారు 27వేల మంది. ఇళ్లలో ఎయిర్ కండీషనర్లు ఉన్నవాళ్లు 97వేలు, ట్రాక్టర్లు-హార్వెస్టర్లు ఉన్నవాళ్లు 94వేలు, కార్లు, బస్సులు, లారీలు తదితర ఫోర్ వీలర్లున్నవాళ్లు 3లక్షల 17వేలు, త్రీవీలర్లున్నవాళ్లు లక్షా 21వేలు, టూ వీలర్లున్నవాళ్లు 23లక్షల 65వేలు ఉన్నారు. 71లక్షల 15వేల మందికి బ్యాంకు అకౌంట్లున్నాయి. రాష్ట్రంలో మొత్తం 46లక్షల 78వేల ఆర్‌సీసీ నివాస భవనాలుండగా, వీటికి 24లక్షల 90వేల యజమానులున్నారు. పెంకుటిళ్లు, పూరిగుడిసెలు, డేరాల్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య కేవలం 13లక్షల 90వేలు. సొంతింటిలోనో లేదా అద్దె ఇంటిలోనో రెండు లేదా అంతకంటే ఎక్కువ గదులున్న ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య ఏకంగా 52లక్షలకు పైగానే ఉంది. 5లక్షలకు పైబడిన కుటుంబాలు ఆర్‌ఓ వాటర్ తాగుతున్నాయి. ఇవి 2014లో సేకరించినవి కనుక ఇప్పడు ఈ సంఖ్య ఇంకా పెరిగేవుంటుంది.

 

ఇప్పుడు చెప్పండి. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు పేదల బతుకులకు ఆసరానిస్తున్నాయా? లేక పెద్దల జేబులు నింపుతున్నాయా? ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు.. రిటైరై వేల రూ.ల పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లు.. ఇన్‌కం టాక్స్ కడుతున్నవాళ్లు.. డబుల్, ట్రిబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటూ ఏసీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మిషన్లు, హోం థియేటర్లు, ఐప్యాడ్లు, ఐఫోన్లు మెయింటెయిన్ చేస్తున్నవాళ్లు.. సొంత కార్లున్నవాళ్లు, ఫ్లైట్ జర్నీ చేస్తున్నవాళ్లు, లక్షల్లో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నవాళ్లు పేదలెలా అవుతారు? వాళ్లకు తెల్ల రేషన్‌కార్డులెందుకు ఇవ్వాలి? తీసుకున్న రేషన్ బియ్యం బ్లాక్‌లో అమ్మకోవడానికా? ఆరోగ్యశ్రీ మొదలు ఆసరా వరకు వివిధ పథకాల కింద ప్రయోజనాలు పొంది మరిన్ని ఆస్తులు కూడబెట్టుకోవడానికా?

ఆలోచించండి. ధైర్యం.. దమ్ము, మానవత్వం ఉంటే, మీరు పేదలు కాదనుకుంటే, బాగానే బతుకుతుంటే తెల్లకార్డులు వాపస్ చేయండి. పథకాలకు అప్లై చేయకండి.. ఆ పథకాలు నిజమైన అనాథలకు, అభాగ్యులకు, నిరాశ్రయులకు, కటిక దరిద్రంలో బతుకుతున్నవాళ్లకు అందేలా సహకరించండి!

 

  • డి మార్కండేయ

(దిశ సౌజన్యంతో..)

 

Latest News